చైత్రశుద్ధ పున్నమి ముందు వచ్చే ఏకాదశిని ‘కామదా’ ఏకాదశి అంటారు. ఈ ఏకాదశి రోజు నియమలతో ఉపవాసం, జాగరణ చేస్తే కోరిన కోరికలన్నీ తీరుతాయని శాస్త్రం చెబుతోంది.

ఏకాదశి పూజావిధానం
ఏకాదశి రోజు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి కాలకృత్యాలు తీర్చుకుని వీలైతే నదీస్నానం చేయాలి . వీలు కాకుంటే ఇంట్లోనే స్నానం చేసే నీటిలో సమస్త పుణ్యనదులను ఆవాహన చేసుకుని స్నానం చేయాలి. అనంతరం దీపారాధన, దైవారాధన చేసుకొని తమ తమ రోజువారీ పనులు యథావిధిగా చేసుకోవాలి. వీలైతే దేవాలయ సందర్శన చేయవచ్చు. వీలుకాని వారు నారాయణ మంత్రాన్ని మనసులో స్మరిస్తూ ఉంటే చాలు. ఏకాదశి రోజు గోపూజ చేస్తే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది. సాయంత్రం వేళ తిరిగి స్నానం చేసి దీపారాధన పూజ చేసుకొని విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి
ఉపవాసం అనే పదానికి ఉప – వసించడం అనే అర్థం ఉంది. అంటే ఏకాదశి రోజున మనం సాధారణంగా చేసే నిత్యకృత్యాలను పక్కన పెట్టి భగవంతునికి దగ్గరగా వసించాలి. ఈ రోజు పూర్తిగా ఉపవాసం ఉండాలి. ఏకాదశి ముందు రోజు అయిన దశమి రోజు రాత్రి కేవలం అల్పాహారం మాత్రం తీసుకొని ఏకాదశి ఘడియలు మొదలైనప్పటి నుంచి ఎటువంటి ఆహారం తీసుకోకుండా ఉపవాసం ఉండాలి.
నిర్జల ఉపవాసం
కొంతమంది నిష్టాగరిష్టులు నీటిని కూడా తాగకుండా ఉపవాసం చేస్తారు. అయితే ఇవన్నీ ఉపవాసం చేసే వారి ఆరోగ్య పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉన్నవారు, వృద్ధులు, పిల్లలు మితంగా సాత్వికాహారం తీసుకోవచ్చని పెద్దలు చెబుతారు. అంటే పండ్లు, పాలు వంటివి అన్నమాట!
భక్తే ప్రధానం
ఏకాదశి ఉపవాసానికి భక్తే ప్రధానం. భక్తి లేకుండా ఎంత పెద్ద పూజలు చేసినా, ఎన్ని ఉపవాసాలు, జాగారాలు చేసినా ఫలితం ఉండదు. భగవంతుడు కోరుకునేది భక్తి మాత్రమే. నిర్మలమైన మనస్సుతో దృష్టిని భగవంతునిపై కేంద్రీకరించే శక్తి ఉన్నవారు మాత్రమే ఏకాదశి ఉపవాసం చేయాలి. భక్తిశ్రద్ధలతో ఏకాదశి ఉపవాసం చేస్తే అనంతకోటి పుణ్య ఫలం లభిస్తుంది.
ఏకాదశి ఉపవాసం వెనుక ఉన్న శాస్త్రీయత
సాధారణంగా మన జీర్ణక్రియ సక్రమంగా పని చేయాలంటే నెలకు ఒక్కసారైనా ఏమి తినకుండా కేవలం నీరు మాత్రమే తాగుతూ ఉంటే శరీరంలోని వ్యర్ధ పదార్ధాలన్నీ బయటకు పోయి జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తుంది. శరీరం నూతనోత్తేజం పుంజుకుంటుంది. మన పెద్దలు ఏర్పాటు చేసిన పూజలు వ్రతాలు వెనుక గొప్ప ఆరోగ్య రహస్యాలు కూడా ఇమిడి ఉన్నాయి. మనమందరం కూడా ఇలా ఏకాదశి ఉపవాసాలు చేద్దాం. పుణ్యంతో పాటు ఆరోగ్యం కూడా పొందుదాం!